కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని తానేప్పుడూ దూషించలేదని తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే విభేదించానని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
అంతేకాదు సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్ నియోజకవర్గాలతో సమానంగా తన నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేశారని గుర్తు చేసిన ఆయన.. కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని వ్యాఖ్యానించారు. అటు మంత్రి పదవిపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చ నీయాంశం అవుతున్నాయి. మంత్రి వర్గంలో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందా? లేదా? .. మంత్రి వర్గ విస్తరణలో ఎలాంటి సంచలన నిర్ణయాలు ఉంటాయి? అనే ఉత్కంఠ రాజకీయా వర్గాల్లో కొనసాగుతోంది.

