కలం, వెబ్ డెస్క్ : బీహార్ లోని సహర్సా జిల్లా సిమ్రి భక్తియార్ పూర్ రైల్వే స్టేషన్ లో సోమవారం తెల్లవారుజామున ఒక ప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్ నుండి సహర్సా వెళ్తున్న ప్యాసింజర్ రైలు (Saharsa Train) నంబర్ 63344 ఇంజన్ లో, దాని పక్కనే ఉన్న ఒక కోచ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో రైల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు నుండి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన తక్షణమే ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.
సిమ్రి భక్తియార్ పూర్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారమ్ నంబర్ 2 పై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ టెండర్లు రంగంలోకి దిగి మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం రైలు (Saharsa Train) ఇంజన్ లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణను చేపట్టారు.
Also Read: మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు: కోర్టు సంచలన తీర్పు!
Follow Us On : WhatsApp

