కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapeta) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు.. ఇటీవల పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణికి ఫిర్యాదు చేశారు.
ఇంటికొచ్చి తింటామని ఆవేదన..
అన్నం సరిగ్గా ఉడకడం లేదని, మరికొన్ని సార్లు మెత్తగా గుజ్జులా మారుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కూరలు సైతం ఉడకకుండానే వడ్డిస్తున్నారని, భోజనం అస్సలు బాగోకపోవడంతో రోజూ ఇంటికి వచ్చి తింటామని పిల్లలు గొడవ చేస్తున్నారని తెలిపారు. తాము ఉదయాన్నే కూలి పనులకు వెళ్తామని, పిల్లలు ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వ బడికి పంపిస్తుంటే ఇలాంటి ఆహారం పెట్టడం సరికాదన్నారు.
నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ..
ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎం ఉషారాణి స్పందిస్తూ.. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో తాము రాజీ పడటం లేదని స్పష్టం చేశారు. నిత్యం వంటశాలలో భోజనం సిద్ధమయ్యే వరకు తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తుంటానని తెలిపారు.
ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఉపాధ్యాయ బృందంతో కలిసి తాను కూడా విద్యార్థులతోనే భోజనం చేస్తున్నామని పేర్కొన్నారు. పొరపాటు జరిగి ఉంటే తప్పకుండా మార్పులు చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

