కలం, వెబ్ డెస్క్: ఈ ఏడాది శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి యాత్రను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేరళ మంత్రి కె. మురళీధరన్ అధికారులను ఆదేశించారు. తిరువనంతపురంలో వార్షిక యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తలెత్తిన లోపాలు, ఇబ్బందులు ఈసారి పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. ఇందుకోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు ప్రారంభించాలని, భక్తులకు కల్పించే వసతుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా యాత్ర ప్రారంభంలో ఉండే రద్దీని నియంత్రించడానికి, తొక్కిసలాట జరగకుండా చూడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. గతంలో రద్దీ కారణంగా భక్తులు నిలిచిపోవాల్సి వచ్చిన పరిస్థితిని ఈసారి రానివ్వకూడదని చెప్పారు.
ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్రమైన ప్రణాళికలతో సిద్ధం కావాలన్నారు. ఏర్పాట్లను మరింత నిశితంగా పరిశీలించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అలాగే శబరిమలకు దారితీసే రోడ్లన్నింటికీ యాత్రా సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల కోసం కేఎస్ఆర్టీసీ (KSRTC) బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచేలా రవాణా శాఖ మంత్రితో కూడా చర్చించినట్లు మంత్రి మురళీధరన్ తెలిపారు.

