కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో చేరికలకు డోర్స్ తెరవాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) పార్టీ నేతలకు సూచించారు. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవాలని చెప్పారు. గురువారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరితో ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు దీనిపై ఫోకస్ చేయాలని ఆదేశించారు. అలాగే పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై జేపీ నడ్డా స్పందించారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, విభేదాలు పక్కన పెట్టి పని చేయాలని సూచించారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా తెలంగాణలో కోటి 20 లక్షల మందికి రేషన్ అందిస్తున్నామన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద సుమారు 4 లక్షల ఇళ్లు కట్టించామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని జేపీ నడ్డా తెలిపారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని పేర్కొన్నారు.

