కలం, వెబ్ డెస్క్ : 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశం.. క్రీడల్లో మాత్రం అత్యంత వెనకబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటిని (YIPESU) ప్రారంభించారు.
అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా యూనివర్శిటీ లోగో, వెబ్ సైట్ ను పీటీ ఉష, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి ఇప్పుడు అకాడమీలు, సదుపాయాలు అవసరముందని రేవంత్ (CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. దీనికోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు.
23 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలను 23 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారని.. కానీ, 12 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు. అంతర్జాతీయ క్రీడల్లో పతకాల పట్టికలో భారత్ అడుగున ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి మంచి ఆటగాళ్లు ఉన్నా ప్రభుత్వాలు తోడ్పాటు అందించడం లేదని సీఎం ఆరోపించారు. గడిచిన 12 ఏళ్లలో స్పోర్ట్స్ పాలసీలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశం గర్వించే క్రీడాకారుల్ని, వ్యాపారవేత్తల్ని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.

