కలం, నకిరేకల్: రోజురోజుకూ మోటార్ రంగంలో సాంకేతికత మారుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను వేముల వీరేశం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం ఆయన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. రోజురోజుకూ మోటార్ రంగంలో సాంకేతికత మారుతోందని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఎంతగానో అవసరమన్నారు.
పర్యావరణ పరిరక్షణకు, పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని సంకల్పించిన నిర్వాహకులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, ఛార్జింగ్ స్టేషన్ నిర్వాహక ప్రతినిధులు, చందంపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

