కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి (Rangaipally) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక ఎంఎస్. అగర్వాల్ స్టీల్ కంపెనీ (MS Agarwal Steel) విస్తరణపై అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. కంపెనీ విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రంగాయపల్లి గ్రామస్తులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.
ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడానికి వస్తున్న బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులతో స్థానికంగా మరింత ఆగ్రహం వ్యక్తమైంది. సమావేశం ప్రారంభం కాగానే కంపెనీ విస్తరణకు అనుకూలంగా మాట్లాడుతున్న కొందరు వ్యక్తులపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీ యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా ‘గో బ్యాక్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సభ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు రంగాయపల్లిలో భారీగా మోహరించారు. గ్రామస్తుల (Rangaipally Villagers) తీవ్ర నిరసనల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది.
Read Also: పెట్టుబడులు ఓకే.. కానీ : ఐటీ సంస్థలకు భట్టి కండిషన్స్!
Follow Us On: Instagram

