కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ (Anant Ambani) తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలకగా, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
ఈ పర్యటన సందర్భంగా కలియుగ దైవానికి అనంత్ అంబానీ (Anant Ambani) ఒక కానుకను ప్రకటించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) టీటీడీకి విరాళంగా అందజేశారు. కేవలం బస్సులను ఇవ్వడమే కాకుండా, వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఖర్చును, అలాగే ఆ బస్సులను నడిపేందుకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే పూర్తిగా భరించనుందని వెల్లడించారు.
దీనితో పాటు తిరుమల గోశాల అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్లో రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంతారా ప్రాజెక్ట్ తరహాలోనే, తిరుమలలోని గోశాలను కూడా అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని అనంత్ అంబానీ హామీ ఇచ్చారు. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ భారీ విరాళం పట్ల అటు దేవస్థానం అధికారులు, ఇటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: నేను యంత్రాన్ని కాదు, 6 రోజుల వర్క్ కల్చర్ నాకొద్దు.. యువతి పోస్ట్ వైరల్
Follow Us On: Instagram

