కలం, వెబ్ డెస్క్ : తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణగా ఉంటుందని నమ్మి వదిలివెళ్లే డేకేర్ సెంటర్లు కొన్నిసార్లు పసిపిల్లల పాలిట నరకప్రాయంగా (Daycare Negligence) మారుతున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో జరిగిన ఒక సంఘటనే ఇందుకు నిదర్శనం. బాధ్యతగా చూసుకోవాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా పసిపిల్లలను గదిలో వేసి తాళం పెట్టడంతో, ఒక 23 నెలల పసికందుపై మరో బాలుడు దాదాపు 15 నిమిషాల పాటు విచక్షణారహితంగా దాడి చేసి, ఏకంగా 25 సార్లు కొరికిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిడ్కో (CIDCO) పరిధిలోని సదరు డేకేర్ సెంటర్లో జూన్ 22న జరిగిన ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఒక కేర్టేకర్ ఒక పిల్లాడిని తీసుకుని గది బయటకు వెళ్తూ, మిగిలిన ముగ్గురు పిల్లలను లోపలే ఉంచి తాళం వేసినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. గదిలో పెద్దలెవరూ లేకపోవడంతో ఆందోళనకు గురైన పిల్లల్లో ఒక బాలుడు, బాధితుడైన చిన్నారిపై దాడి చేసి దాదాపు 15 నిమిషాల పాటు దారుణంగా కొరికాడు. ఈ దాడిలో సదరు పసికందు ముఖం, ఛాతి, వీపు, కాళ్లపై తీవ్రమైన గాయాలయ్యాయి.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మాత్రమే డేకేర్ యాజమాన్యం తమకు సమాచారం అందించిందని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొదట చిన్న గీతలు మాత్రమే పడ్డాయని అబద్ధం చెప్పారని, అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాబును ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు డేకేర్ యాజమాన్యం తమకు 10 లక్షల రూపాయల నగదుతో పాటు మూడేళ్ల పాటు ఉచిత విద్యను ఆఫర్ చేసిందని తండ్రి ఆరోపించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు డేకేర్ సీఈఓ, మేనేజర్లు, ప్రిన్సిపాల్, కేర్టేకర్ సహా ఆరుగురు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సదరు డేకేర్ సెంటర్కు మున్సిపల్ అనుమతులు కూడా లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

