కలం వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) గన్ మెన్ కృష్ణ చైతన్య ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హయత్నగర్లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
బెట్టింగ్ యాప్స్(Betting Apps) కి బానిసైన చైతన్య ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. దీంతో భారీగా అప్పులు చేసి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడన్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగానే చైతన్య ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చైతన్యకు చికిత్స జరుగుతుందని, ఈ విషయాన్ని సంచలనం చేయొద్దని చెప్పారు. చైతన్య ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఇది కేవలం ఆర్థిక సమస్యల కారణంగానే జరిగిందా? మరేదైనా కారణముందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ ఘటనపై చైతన్య తండ్రి శివరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉదయం 6 గంటలకు గన్ పేలిన సౌండ్ వచ్చిందని వెల్లడించారు. తన కోడలు సమాచారం ఇచ్చిన వెంటనే కృష్ణ చైతన్యను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు లేవని చెప్పారు. కృష్ణ చైతన్యకు బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వంటి అలవాట్లు కూడా లేవన్నారు. రివాల్వర్ ఇంటికి తీసుకురావడం వెనుక కారణాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మళ్లీ విధుల్లోకి వెళ్లేందుకే సర్వీస్ రివాల్వర్ తీసుకొచ్చినట్లు అనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం సర్జరీ జరుగుతోందని, అసలేం జరిగిందో పోలీసుల దర్యాప్తులో తెలుస్తుందని శివరాం ప్రసాద్ తెలిపారు.
Read Also: బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
Follow Us On: X(Twitter)


