రికార్డుల వేటలో 74 ఏళ్ల నసీముద్దీన్ హ్యాట్రిక్ !

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌ (Pakistan) కు చెందిన వెల్డర్ నసీముద్దీన్ (Naseemuddin) 74 ఏళ్ల వయసులోనూ అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపిస్తూ, ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) లో హ్యాట్రిక్ సాధించారు. తాజాగా నసీముద్దీన్ తన చేతిలో ఒక గుడ్డును పట్టుకుని, ఏకంగా 38 మార్బుల్ టైల్స్‌ను పగలగొట్టి కొత్త రికార్డు నెలకొల్పారు.

గతంలో ఉన్న 30 టైల్స్ రికార్డును అధిగమిస్తూ ఈ ఘనతను సాధించారు. గిన్నిస్ సంస్థ దీనిని అధికారికంగా ధృవీకరించి, తమ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. ఇది ఆయనకు తొలి రికార్డు కాదు. ఇంతకుముందే ఒకే దెబ్బతో 163 వాల్‌నట్‌లను పగలగొట్టడం, అలాగే ఒక చేత్తో ఆపిల్స్‌ను నలిపేయడం వంటి అరుదైన ఘనతలు సాధించారు.

ఈ రికార్డుల ప్రతిభ ఆయన కుటుంబంలోనే కొనసాగుతుండటం విశేషం. పాకిస్థాన్ తరఫున అత్యధిక గిన్నిస్ రికార్డులు సాధించిన రషీద్ నసీమ్ ఆయన కుమారుడే. అంతేకాదు, ఆయన మనవడు, మనవరాలు, కూతురు, కోడలు కూడా ప్రపంచ రికార్డులు సాధించడం విశేషం. తన ఈ విజయాన్ని నసీముద్దీన్ పాలస్తీనా ప్రజలకు, పాకిస్థాన్ సైన్యానికి, దేశ ప్రజలకు అంకితం చేశారు.

వృద్ధాప్యంలో కూడా దేశానికి గౌరవం తీసుకురావడం తనకు గర్వంగా ఉందని తెలిపారు. అయితే, ఇంతటి విజయాలు సాధించినప్పటికీ ప్రభుత్వ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులను కలవాలన్న తన కోరిక ఇంకా నెరవేరలేదని చెప్పారు. 74 ఏళ్ల వయసులోనూ నసీముద్దీన్ చూపుతున్న పట్టుదల, కృషి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>