కలం, వెబ్డెస్క్: రాజస్థాన్ (Rajasthan)లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై బుధవారం తెల్లవారుజామున రిషికేశ్ నుంచి ఇండోర్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు, ట్రక్కు రెండింటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వేళ ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్ప్రెస్వేకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పి, వాహనాలను తొలగించిన అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రావెల్స్ సంస్థ నుంచి మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

