కలం, ఖమ్మం బ్యూరో: ఆధార్ కార్డులో వయస్సు తక్కువ ఉండడంతో దశాబ్ద కాలంగా పెన్షన్ రాక ఓ వృద్ధుడు అష్టకష్టాలు పడుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు(Manuguru) మండలంలో గల వాగు మల్లారం పరిధిలో, కోట రత్నం అనే వృద్ధుడు 10 ఏళ్లుగా పెన్షన్ రాకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఉండటానికి పక్కా ఇల్లు లేదు, బతకడానికి పెన్షన్ కూడా రాకపోవడంతో ఈ 68 ఏళ్ల వృద్ధుడు ఇంకా రోజు కూలి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతని వయస్సు రీత్యా రోజు కూలీ కూడా దొరకని పరిస్థితి నెలకొంది.
రోజు కూలీ కోసం అడ్డ మీద నిల్చున్న ఈ వృద్ధుడిని కలం ప్రతినిధి పలకరించగా, తన గోడు వెళ్లబోసుకొన్నాడు. పిల్లల బాధ్యతలు పూర్తి చేసిన రత్నం, భార్యతో కలిసి వాగు మల్లారంలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజు కూలి కోసం రోడ్డెక్కి, దొరికితే పని చేస్తారు. దొరక్కపోతే పస్తులు పడుకోవాల్సిందేనట. వృద్దాప్య పెన్షన్కు వుండాల్సిన అన్ని అర్హతలు రత్నం దగ్గర ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ తనకు పెన్షన్ రావడం లేదని, అధికారుల చుట్టూ తిరిగి విసిగి పోయానని నిస్సహాయతను వ్యక్తం చేశాడు.
రత్నం చదువుకోలేదు. దీంతో ఆధార్ కార్డు ఇచ్చే సమయంలో పుట్టిన తేది 10 ఏళ్లు తక్కువ పడింది. ఇదే ఆ వృద్ధుడికి శాపంగా మారింది. అయితే ఓటర్ కార్డు మీద సరిగ్గానే ఉన్నప్పటికీ, అధికారులు ఒప్పుకోవడం లేదని చెబుతున్నాడు. ఆధార్ కార్డు ప్రకారం చూసుకున్నా ప్రస్తుతం అతని వయస్సు 58 ఏళ్లు.. అంటే పెన్షన్కు కావలసిన అర్హత ఉన్నట్లే, అయినా కూడా ఎందుకు పెన్షన్ మంజూరు కావడం లేదో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పటికైనా స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఉండటానికి ఇల్లు, జీవించడానికి పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తే కష్టాలు తీరుతాయని ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్
Follow Us On : WhatsApp

