కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనున్న టీమిండియాకు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక సూచనలు చేశాడు. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ విజయం సాధించినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరుపై పఠాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. పెద్ద జట్లతో తలపడేటప్పుడు సూర్య బాధ్యతాయుతంగా ఆడి పరుగులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ శాంసన్ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, సూర్యకుమార్ మాత్రం 16 బంతుల్లో 18 పరుగులే చేయగలిగాడు. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ (10 పరుగులు) వరుసగా విఫలమవ్వడంపై పఠాన్ స్పందించాడు. అభిషేక్ షాట్లు ఆడేటప్పుడు వెనుక మోకాలు ఎక్కువగా వంగుతోందని, దీనివల్ల శరీర బరువు వెనక్కి పడి తప్పులు జరుగుతున్నాయని సాంకేతిక లోపాన్ని ఎత్తిచూపాడు.
ఈ మ్యాచ్లో 15 బంతుల్లో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ ప్రదర్శనను పఠాన్ (Irfan Pathan) కొనియాడాడు. అయితే, తిలక్ బ్యాటింగ్ ఆర్డర్ మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. సాధారణంగా మూడో స్థానంలో వచ్చే తిలక్, ఇప్పుడు ఐదో స్థానంలో ఆడుతున్నాడని పేర్కొన్నాడు. తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున తిలక్ (Tilak Varma) సగటు తగ్గే అవకాశం ఉందని, కానీ అతనిని కేవలం గణాంకాలతోనే కొలవకూడదని సూచించాడు. క్లిష్ట సమయాల్లో జట్టుకు అవసరమైన, వేగవంతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్న తిలక్ ప్రాధాన్యతను మేనేజ్మెంట్ బహిరంగంగా వివరించాలని కోరాడు.
ప్రస్తుతం 47 టీ20ల్లో 1,361 పరుగులు చేసిన తిలక్ వర్మ రికార్డు అద్భుతంగా ఉన్నప్పటికీ, జట్టు అవసరాల కోసం అతను రిస్క్ తీసుకుంటున్నారని పఠాన్ విశ్లేషించాడు. మార్చి 5, గురువారం ముంబైలో ఇంగ్లాండ్తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా బ్యాటర్లు సమష్టిగా రాణించాలని క్రీడా వర్గాలు ఆశిస్తున్నాయి.
Read Also: భారత్ vs ఆఫ్ఘాన్ టూర్.. షెడ్యూల్ ఇదే !
Follow Us On: Sharechat

