కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో రోడ్డు వెంబడి రూ.500 కరెన్సీ నోట్లు (Currency Notes) చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. బుధవారం ఉదయం రోడ్డుపై నోట్లు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ నోట్లు (Currency Notes) అసలువా? నకిలీవా? అనే సందేహంతో కొందరు పరిశీలిస్తుంటే, మరికొందరు మాత్రం ఏవైనా పర్వాలేదని తీసుకుంటున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఈ నోట్లు నిజమా లేక నకిలీనా అని, అలాగే ఇవి ఇక్కడ ఎలా పడ్డాయి అనే కోణంలో విచారణ ప్రారంభించారు. కాగా నిన్న ఇదే ప్రాంతంలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద రూ.5,500 విలువగల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనకు ఆ ముఠాతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

