కలం, వెబ్డెస్క్: పదవ తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సీపీ సజ్జనార్ (CP Sajjanar) కీలక విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా తల్లిదండ్రుల తమ పిల్లలను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ఈ ఫలితాలు విద్యార్థుల సుదీర్ఘ ప్రయాణంలో చిన్న మలుపు మాత్రమేనని, జీవిత గమనాన్ని శాసించలేవని హితవు పలికారు. అయితే ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసినట్లు సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోవడం అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలని, జీవితానికి ముగింపు కాకూడదన్న విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని తెలిపారు.
అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఆశలను, అంచనాలను పిల్లలపై మోపి వారిని ఒత్తిడిని గురిచేయొద్దని సూచించారు. ఫలితం ఏదైనా పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని అన్నారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు అత్యంత ముఖ్యమని తెలిపారు. అంతేకాకుండా ఫలితాల అనంతరం పిల్లలను నిశితంగా గమనిస్తూ ఉండాలని, ఒంటరిగా, మౌనంగా ఉంటే వెంటనే వారి వెన్నంటి ధైర్యం చెప్పి వారి మనసులోని భయాన్ని పోగోట్టాలని సజ్జనార్ సూచించారు. ఇటువంటి సమయంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో మాట్లాడి ఫెయిల్ అయిన పిల్లలకు ధైర్యం చెప్పాలని, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని తెలిపారు.

