కలం, నిజామాబాద్ బ్యూరో: మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ ముఖచిత్రం మారుతోంది. యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు ముందుకు వస్తున్నారు. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువత భారీగా పోటీ చేయగా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది.
కామారెడ్డి (Kamareddy) పట్టణ పరిధిలోని 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా 22 ఏళ్ల యువతి రాంశెట్టి హర్షిత పోటీలో నిలిచారు. హైదరాబాద్లోని ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో బీటెక్ పూర్తి చేసిన హర్షితకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హర్షితకు పార్టీ బి-ఫామ్ను అందజేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
పోటీ చేసే అవకాశం కల్పించినందుకు హర్షిత కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: 2100 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
Follow Us On: Youtube


