కలం, వెబ్ డెస్క్: చెరువుల పరిరక్షణతోపాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRA) పార్కు స్థలాన్ని కాపాడింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నంది హిల్స్ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంది హిల్స్ కాలనీలో దాదాపు 2100 గజాల పార్కు (Park) స్థలాన్ని కొందరు స్థానిక రాజకీయ నాయకులు కబ్జా చేశారు. అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నాలు సాగించారు. దీనిపై కాలనీ వాసులు కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. సదరు స్థలం పార్కుకు కేటాయించినదేనని నిర్ధారించుకున్న అనంతరం అక్రమ కట్టడాలను, లేఅవుట్ గుర్తులను తొలగించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించి, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి రాజకీయ పలుకుబడితో ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని కాపాడటంపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.


