కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (Constitutional Amendment Bill) ప్రవేశపెట్టిన సందర్భంగా తీవ్ర చర్చ, గందరగోళం నెలకొంది. ఈ బిల్లులోని నిబంధనలపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యతిరేకించాయి. బిల్లును స్వీకరించే అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఈ విషయాన్ని తేల్చేందుకు డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి.
ప్రతిపక్షాల డిమాండ్కు స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించి సభలో డివిజన్కు అంగీకరించారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్లో ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. బిల్లు స్వీకరణకు అనుకూలంగా 207 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 126 ఓట్లు నమోదయ్యాయి. మెజారిటీ సభ్యుల మద్దతు లభించడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ముందడుగు వేసింది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
చర్చను ప్రారంభించిన మంత్రి అర్జున్ రామ్..
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కీలకమైన చర్చ ప్రారంభమైంది. ఈ సవరణ బిల్లుపై చర్చ జరిపేందుకు స్పీకర్ అనుమతిని మంజూరు చేయడంతో, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ సభలో చర్చను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఈ బిల్లు అత్యంత ప్రాముఖ్యత కలిగినదని, అందుకే సభలోని సభ్యులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తగిన సమయం, అవకాశం కల్పిస్తామని తెలిపారు. మంత్రి మేఘావల్ ఈ సవరణ యొక్క ఆవశ్యకతను, దీనివల్ల చేకూరే ప్రయోజనాలను సభకు వివరించారు.

