కలం, సత్తుపల్లి: ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli) పట్టణంలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రీడాకారుల కోసం అధునాతన సౌకర్యాలతో కూడిన అవుట్డోర్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులకు సంబంధించి బుధవారం స్థల పరిశీలన నిర్వహించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి(MLA Matta Ragamayee), రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కలిసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి సునీల్ రెడ్డి పాల్గొన్నారు.
స్టేడియం నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి క్రీడా మైదానంలో స్థల కొలతలు వేయించారు. అనంతరం క్రీడా ప్రాంగణాన్ని అన్ని వసతులతో తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఎమ్మెల్యే రాగమయి, నాయకులు దయానంద్ సూచనలు చేశారు. అలాగే కళాశాల ప్రాంగణంలోని వ్యాయామ పరికరాలను పరిశీలించారు. ప్రస్తుతం వినియోగంలో లేని ఓపెన్ జిమ్ పరికరాలకు వెంటనే మరమ్మతులు చేసి యువత, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి స్థానిక క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే రాగమయి, డాక్టర్ దయానంద్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు క్రీడలపై మరింత ఆసక్తి పెరుగుతుందని వారు పేర్కొన్నారు.

