మెడిక‌ల్ కాలేజీలో భారీ అగ్ని ప్ర‌మాదం.. ప‌ది మంది మృతి!

క‌లం, వెబ్ డెస్క్‌: ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ (SCB Medical College)లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని ట్రామా కేర్ ఐసీయూ (ICU) విభాగంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి వార్డులో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమించారు.

ఈ ప్రమాదంలో రోగులను కాపాడే క్రమంలో సుమారు 11 మంది ఆసుపత్రి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వార్డులో ఉన్న మరో 23 మంది రోగులను ఇతర విభాగాలకు సురక్షితంగా తరలించారు. అయితే, అత్యవసర చికిత్సలో ఉన్న ఏడుగురు రోగులు వార్డు మార్చే క్రమంలోనే చనిపోగా, మరో ముగ్గురు ఆ తర్వాత మరణించారు. గాయపడిన సిబ్బందికి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం కీలక ప్ర‌క‌ట‌న చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం ఉంది అనే విషయాలను తేల్చేందుకు విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>