కలం, ఖమ్మం బ్యూరో: యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా భద్రాచలం (Bhadrachalam) పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధునాతన ‘గంజాయి టెస్టింగ్ కిట్స్’ ద్వారా అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు తేలింది. గంజాయి సేవించి పట్టుబడిన ఆ నలుగురు యువకులకు పోలీసులు ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం భద్రాచలంలోని ‘దక్షత సొసైటీ జిల్లా మత్తు పదార్థాల వ్యసన పునరావాస కేంద్రానికి (రిహబిలేటేషన్ సెంటర్)’ తరలించారు. ఇకపై భద్రాచలంలో (Bhadrachalam) గంజాయి కిట్స్ ద్వారా తనిఖీలు మరింత ఉధృతం చేస్తామన్నారు. మత్తుకు బానిసలైనవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
పేకాట స్థావరం దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ శివారులోని పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు నిందితులు పోలీసులకు చిక్కగా, ఒకరు పరార్ అయ్యారు. నిందితుల నుంచి రూ. 33 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

