కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్య సాధన దిశగా సమన్వయంతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో శనివారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మ్యాపింగ్ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దశను ప్రణాళి కాబద్ధంగా అమలు చేస్తూ ఎలాంటి జాప్యానికి తావులేకుండా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
కరీంనగర్లోని పద్మనగర్, ఆరేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనుల పురోగతి, మౌలిక సదుపాయాలు, పెండింగ్ అంశాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ఇండ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనుల పూర్తి చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సమయపాలనతో ముందుకెళ్లాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, తహసీల్దారులు లక్ష్మీ నరసింహారావు, నరేందర్ వెంకటలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

