కలం, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) జువ్వలదిన్నె పోర్ట్ సందర్శన ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోర్టు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, మత్స్య కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పర్యటన, ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రెస్పాండ్ అయ్యారు. జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తల్లిని తరిమేశావని, చెల్లిని గెంటేశావని, దైవం అంటే భక్తి లేదని జగన్పై విమర్శలు చేశారు. జగన్కు దేశం అంటేనే ద్వేషం అని ఆరోపించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి చేస్తుంటే ఉసూరుమని ఏడుస్తూ స్వార్థంతో అడ్డుకుంటున్నారన్నారు. జగన్ మనసంతా విధ్వంసమే ఉంటుందని, రప్పా రప్పా నరుకుతామని, అమరావతిని మార్చేస్తామని, కట్టినవన్నీ కూల్చేస్తామని, కంపెనీలన్నింటినీ వెళ్లగొడతామంటూ దుర్మార్గ పనులు చేస్తున్నారన్నారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి, తరిమేస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాననడం ముమ్మాటీకీ సైకోయిజమేనని వ్యాఖ్యానించారు.
మంత్రి లోకేశ్ (Nara Lokesh) వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. నారా లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలుసునని పోస్టులో పేర్కొంది. మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజైనా ఇంటికి పిలిచి వారికి పట్టెడన్నం పెట్టావా? ఏనాడైనా ఇంటికి పిలిచి ఒక జత బట్టలు పెట్టావా? వారి యోగ క్షేమాల గురించి ఏనాడైనా ఆరా తీశావా? అంటూ ప్రశ్నలు సంధించింది. ఇక మీ బాబాయ్ రామ్మూర్తినాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారని లోకేశ్ను నిలదీసింది. మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదని ప్రశ్నించింది. నువ్వు ఒకటి అంటే మేము పది అనగలమని, ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నారా లోకేశ్ను హెచ్చరించింది.
ఇక చంద్రబాబు గురించి మాట్లాడాలంటే చాంతాడంత చరిత్ర ఉందని, టీడీపీ పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ సంస్థ ఏవీ తనవి కావని పేర్కొంది. చంద్రబాబు (Chandrababu) రాజకీయ చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని ఆరోపించింది. నాడు సీఎం పదవి కోసం చంద్రబాబు తోడళ్లుడికి డిప్యూటీ సీఎం పదవి అన్నాడని, గద్దెనెక్కగానే తన్ని తరిమేశాడని విమర్శలు గుప్పించింది. సీఎం పదవి కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీని వాడుకొని మోసం చేశాడని, కుటుంబ సభ్యులను నమ్మించి నట్టేట ముంచాడని మండిపడింది. తర్వాత కూడా తన మనుగడ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీని ఉపయోగించుకున్నాడని, హరికృష్ణ, ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ను కూడా వాడుకొని వదిలేశాడని ఆరోపించింది. చంద్రబాబు హరికృష్ణ శవం పక్కనే రాజకీయం చేశాడని, నాడు ప్రధాని మోడీని దెయ్యం, టెర్రరిస్టు అని, ఇప్పుడు అదే మోడీని దేవుడిగా చూస్తున్నాడని సెటైర్లు వేసింది.
చంద్రబాబుకు అధికారమే పరమావధి అని, దాని కోసం ఎంతకైనా తెగిస్తాడని, నిస్సిగ్గుగా పార్టీలు మార్చి మార్చి జత కడతాడని YSRCP విమర్శలు చేసింది. చంద్రబాబు ఒక్క ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని, ప్రతీసారి ఎవరో ఒకరి ఊతకర్ర కావాల్సిందేనని ఎద్దేవా చేసింది. చంద్రబాబు ఏనాడైనా.. ఎక్కడైనా తోబుట్టవుల గురించి ఎక్కడైనా చెప్పాడా అని ప్రశ్నించింది. జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీని తరిమేసింది చంద్రబాబేనని ఆరోపించింది. రెండు ఎకరాల నుంచి లక్షల కోట్లతో దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగాడని, ఇలా చంద్రబాబు గురించి ఎన్ని చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయని పేర్కొంది.
Read Also: తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు.. కేటీఆర్ ఫైర్
Follow Us On : WhatsApp

