కలం, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాలు (Donations) వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే టీటీడీకి ఏకంగా రూ.96.98 కోట్ల విరాళాలు వచ్చినట్లు అధికారులు నేడు వెల్లడించారు. ఆన్లైన్లో 2,354 మంది భక్తులు, ఆఫ్లైన్లో 106 మంది భక్తులు విరాళాలు అందించినట్లు తెలిపారు. వీరిలో 1246 మంది రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విరాళాలు సమర్పించారు. ఇద్దరు భక్తులు రూ.కోటికి పైగా విరాళాలు అందించారు. కొత్త డోనర్ పాలసీతోనే విరాళాలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి హైదరాబాద్కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ జగదీష్, సీఎస్ఓ మాణిక్ రెడ్డి పుల్లగూర్ల చెరో రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. సమాజంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే టీటీడీ సంకల్పానికి ఇలాంటి విరాళాలు మరింత బలాన్ని చేకూరుస్తాయని చెప్పారు.

