కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం(Khammam) జిల్లాలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (Sunil Dutt) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి కేసులలో కేవలం నిందితులను పట్టుకోవడమే కాకుండా, గంజాయి సరఫరా మూలాలను గుర్తించి సప్లై చైన్ను పూర్తిగా అడ్డుకోవడమే తమ లక్ష్యమని టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
ఈ దాడులలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నవరపేట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి, రోల్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకూరి మామిడి తోట వద్ద మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 గ్రాముల గంజాయి, ఒక యాక్టివా ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.

