కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(Anantha Babu)కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న అనంతబాబుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో వాదించారు.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో కోర్టులో సాక్ష్యం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అవసరమైతే చంపుతానని అనంతబాబు సాక్షులను బెదిరించారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో నిందితుడికి బెయిల్ ఇస్తే కేసు పూర్తిగా పక్కదారి పట్టించే అవకాశం ఉందని.. సాక్షుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో పీపీ వాదనలతో ఏకిభవించిన ఏసీబీ కోర్టు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.

