కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case) విచారణ హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసు రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా విచారణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతర వ్యక్తులు సీబీఐ న్యాయస్థానం ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో భద్రత నడుమ నిందితుల సమక్షంలో విచారణ ప్రక్రియ సాగింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని ఏళ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఈ హత్య కేసులో ఇప్పటికే సీబీఐ పలు అనుబంధ ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తుండగా, విచారణను వేగవంతం చేయాలని ఉన్నత న్యాయస్థానాలు సైతం గతంలో ఆదేశించాయి. ఈ నేపథ్యంలో జులై 3న జరగబోయే తదుపరి విచారణపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

