కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా ద్వారా రాష్ట్ర సంపదను దోచారని ఆరోపించారు. నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారని, కంటైనర్లలో డ్రగ్స్ రాష్ట్రానికి వచ్చాయని మండిపడ్డారు. గత ప్రభుత్వాల వల్ల విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో దొరుకుతున్నాయని, చంద్రబాబు హయాంలో సైతం మాఫియా ఉందన్నారు. జగన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి ద్రోహం చేస్తే పార్లమెంట్లో ప్రశ్నించే ఒక్క మగాడు లేడని షర్మిల ఎద్దేవా చేశారు.
రాజధానికి నిధులు కాకుండా అప్పులు ఇస్తుంటే ఒక్క ఎంపీ కూడా ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. జగన్ (YS Jagan), చంద్రబాబు ఇంతలా బీజేపీకి ఎందుకు బానిస అయ్యారని ప్రశ్నించారు. మోడీ ఎందుకు ఊడిగం చేస్తున్నారని, వీళ్లకు స్వార్థ రాజకీయాలు తప్పా , రాష్ట్ర సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల అన్నారు.

