కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ ఛాంపియన్గా భారత్ నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గర్జించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో తమ సత్తా చాటింది. న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అక్సర్ 3 వికెట్లతో మెరిశారు. బ్యాటర్లలో మరోసారి సంజూ శాంసన్ మెరుపులు మెరిపించాడు. ఓపెనర్స్ అభిసేక్, సంజూలతో పాటు ఇషాన్ కిషన్ కూడా అర్థశతకాలతో అదరగొట్టారు. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ను ఆలౌట్ చేసిన టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ నిలవలేకపోయింది. అక్షర్ పటేల్ (3 వికెట్లు) తన స్పిన్ మాయాజాలంతో కివీస్ టాప్ ఆర్డర్ను కకావికలం చేయగా, జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే రచిన్ రవీంద్రను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశారు. టిమ్ సీఫెర్ట్ (52) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, వరుణ్ చక్రవర్తి ఆయనను అవుట్ చేయడంతో కివీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాలిలో ఎగిరి రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టిన తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. డీప్ మిడ్ వికెట్లో మిచెల్ ఇచ్చిన క్యాచ్ను కిషన్ సులభంగా అందుకోగా, తిలక్ వర్మ కూడా బౌండరీ లైన్ వద్ద చురుగ్గా కదిలి ఫిన్ అలెన్ క్యాచ్ను ఒడిసిపట్టారు.
అంతకుముందు బ్యాటింగ్లో సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54), అభిషేక్ శర్మ (52) మెరుపు ఇన్నింగ్స్లతో భారత్కు 255 పరుగుల భారీ స్కోరును అందించారు. చివర్లో శివమ్ దూబే (26*) మెరుపులు మెరిపించడంతో కివీస్ ముందు హిమాలయమంత లక్ష్యం నిలిచింది. మొత్తానికి సమిష్టి కృషితో కివీస్ను చిత్తు చేసిన టీమిండియా మరోసారి ప్రపంచ విజేతగా అవతరించింది. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం దేశవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని నింపింది.

