కలం, వెబ్ డెస్క్: ఏపీలో 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారికి టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ (YS Jagan) డిమాండ్ చేశారు. వీరికి సైతం టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పారు.
దాదాపు 20 నుంచి 25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్కావాలని నిబంధన పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. వీళ్లకు అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? అని చెప్పుకొచ్చారు.
టీచర్లందరికీ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారని వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అంటూ ప్రశ్నించారు. దీనిపై చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని పేర్కొన్నారు.

