కలం, వెబ్ డెస్క్: ఏపీలో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను బుధవారం మంత్రి విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు.
కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుంచి నీటి విడుదల ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కృష్ణా డెల్టాకు పట్టిసీమతోనే ఉపిరి అని పేర్కొన్న మంత్రి.. పట్టిసీమ ఒట్టిసీమ అన్న వైఎస్ జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముందుచూపుకి నిదర్శనం పట్టిసీమ అని కొనియాడారు.
పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణా జలాలతో అనుసంధానం చేసి.. నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 2014-19లో రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందని తెలిపారు. ఎత్తిపోతల పథకంపై గొడ్డలి పార్టీ అనేక ఆరోపణలు చేసిందని.. ఇప్పుడు అదే పథకం ద్వారా ఇప్పటివరకు 450 టీఎంసీలు తరలించామని అన్నారు. కర్ణాటకలో ఆలమట్టి నుంచి నాగార్జునసాగర్ వరకు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీలో ఉన్నాయని చెప్పారు. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి పోకుండా ఒడిసిపట్టుకుని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని తెలిపారు. సముద్రంలో కలిసిపోయే నీటిని సాగుకు మళ్లించడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతోందని అన్నారు.

