కలం, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా ఏటూరునాగారం (Eturunagaram)లో విషాదం చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది.
ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ముక్త్యం సతీష్ (20), కొంగాల గ్రామానికి చెందిన దుబ్బ రవిత్రయని (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరనే ఆందోళనతో ఆదివారం మధ్యాహ్నం ఏటూరునాగారం అటవీ కార్యాలయం సమీపంలోని అడవిలోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు.
విషం ప్రభావంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా, యువతి కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చి కుప్పకూలిపోయింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఏటూరునాగారం (Eturunagaram) సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం సతీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. మృతుడి తల్లి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

