కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఒక చారిత్రాత్మక మార్పుకు వేదికైంది. గత దశాబ్ద కాలానికి పైగా సంస్థను విజయపథంలో నడిపించిన సీఈఓ (Apple CEO) టిమ్ కుక్, తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఆయన తన బాధ్యతల నుండి వైదొలగనున్నారు. స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ పగ్గాలను చేపట్టిన టిమ్ కుక్, తనదైన శైలిలో సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తీర్చిదిద్దడమే కాకుండా, మార్కెట్ విలువను ఊహించని స్థాయికి తీసుకెళ్లారు. ఐఫోన్ వైవిధ్యం నుంచి సర్వీసెస్ రంగం వరకు యాపిల్ సాధించిన అద్భుత విజయాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
టిమ్ కుక్ వారసుడిగా యాపిల్ ప్రస్తుత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సంస్థలో అత్యంత నమ్మకస్తుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన టెర్నస్, ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్ వంటి కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకు ఉందని బోర్డు పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. టిమ్ కుక్ హయాం ముగిసి, టెర్నస్ నాయకత్వంలో యాపిల్ ఎలాంటి సరికొత్త వండర్స్ సృష్టిస్తుందో అని టెక్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

