కలం, కరీంనగర్ బ్యూరో: ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ, తీవ్ర వడదెబ్బకు గురై మృతి చెందిన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ పరిధిలోని దుర్షేడ్ గ్రామానికి చెందిన ఊర రఘు (33) నారాయణపల్లె గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో మొగ్దుంపూర్ వద్ద తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో వడదెబ్బ (Heatstroke) బారిన పడ్డాడు. సేదతీరేందుకు కూల్డ్రింక్ తాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఈక్రమంలో అతని తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రఘు మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఊర అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.

