కలం, వెబ్ డెస్క్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత జట్టు ఖరారైంది. జపాన్లో జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికైన జట్టులో తెలుగు షట్లర్ తన్వీ రెడ్డి అండ్లూరి (Tanvi Reddy Andluri) చోటు దక్కించుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జూన్ 26 నుంచి జూలై 5 వరకు జపాన్లోని యత్సుషిరోలో ఈ టోర్నీ జరగనుంది. జట్టు విభాగం పోటీలు జూన్ 26 నుంచి 30 వరకు నిర్వహించగా, ఆ తర్వాత వ్యక్తిగత విభాగం మ్యాచ్లు జరగనున్నాయి.
గత నెల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా అండర్-19 ర్యాంకింగ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన తన్వీ పాత్రి, అభినవ్ గార్గ్ నేరుగా భారత జట్టులో స్థానం సంపాదించారు. మిగతా ఆటగాళ్లను గువాహటిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఎంపిక పరీక్షల ఆధారంగా ఎంపిక చేశారు. గత ఏడాది జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ తొలి మిక్స్డ్ టీమ్ పతకాన్ని గెలుచుకోవడంతో ఈసారి జట్టుపై అంచనాలు పెరిగాయి.
ప్రస్తుతం ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారని, ఈ టోర్నీలో భారత్ పలు పతకాల కోసం పోటీ పడుతుందని భారత బ్యాడ్మింటన్ సంఘం భావిస్తోంది. బాలికల సింగిల్స్ విభాగంలో తన్వీ పాత్రితో పాటు తన్వీ రెడ్డి అండ్లూరి, ఆదర్శిని శ్రీ ఎన్.బి., షైనా మనిముత్తు భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. జపాన్లో జరిగే ఈ టోర్నీలో యువ భారత షట్లర్లు ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

