కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్లో చిట్టీ డబ్బుల వివాదం యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. అరుకాల సాయికుమార్ అనే యువకుడు జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల చిట్టీ డబ్బులు కట్టాడు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. “ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందులు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి, వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

