కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డును మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తనిఖీ చేశారు. వ్యర్థాల నిర్వహణ పనుల్లో భాగంగా డంప్యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాలను యంత్రాల సాయంతో తొలగించే బయోమైనింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఏ దశలో ఉంది.. ఎంత మేర వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా నిర్మూలించారనే వివరాలను ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయోమైనింగ్ పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం డంప్యార్డులో వ్యర్థాలను మండిస్తున్న క్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలకు, కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా, పొగ ప్రభావాన్ని తగ్గించాలని ఆదేశించారు.

