కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం (Dummugudem) మండలంలోని బైరావులపాడు గ్రామంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలం నుంచి రోడ్డుపైకి ట్రాక్టర్ నడుపుతూ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో అంగిరేకుల రిషికేష్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బైరావులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
విషయం తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) గ్రామానికి చేరుకుని రిషికేష్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.

