కలం, స్పోర్ట్స్ : సింగపూర్లో జరుగుతున్న ఎన్బీఏ (NBA) రైజింగ్ స్టార్స్ ఇన్విటేషనల్ 2026 వేదికగా క్రీడా ప్రపంచం షాకయ్యే సరికొత్త అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బాస్కెట్బాల్ ఆటలో కేవలం ప్లేయర్ల ప్రతిభే కాదు, ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా మ్యాచ్లను శాసించబోతోంది. ఆసియా ఖండంలోని టెక్నాలజీ స్టార్టప్ల కోసం ‘ఎన్బీఏ లాంచ్ప్యాడ్’ ప్రోగ్రామ్ కింద ‘ఫ్యూచర్ ఆఫ్ బాస్కెట్బాల్ ఇన్ ఆసియా’ అనే సరికొత్త విభాగాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ఆసియా అంకుర సంస్థలకు ఎన్బీఏ గ్లోబల్ ప్లాట్ఫామ్పైకి నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఎన్బీఏ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ డేవిడ్ లీ ఈ సంచలన మార్పులను వెల్లడించారు. ఆసియా ప్రాంతాన్ని కేవలం ఒక వ్యాపార మార్కెట్లా కాకుండా, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణల పవర్హౌస్గా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. బాస్కెట్బాల్ భవిష్యత్తును మార్చేసేందుకు ఇదొక దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ అని స్పష్టం చేశారు.
ఈ అనౌన్స్మెంట్ అయిన వెంటనే సింగపూర్కు చెందిన ‘స్విష్ బాస్కెట్’ సంస్థ, ఏఐ ఆధారంగా పనిచేసే తమ అధునాతన బాస్కెట్బాల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ను లైవ్లో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రీడా రంగంలో అద్భుతమైన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు 2022లో ఈ లాంచ్ప్యాడ్ ప్రస్థానం మొదలైంది. మొదట్లో ఆటను మెరుగుపరిచే టెక్నాలజీకే పరిమితమైనా, ఇప్పుడు మీడియా, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, బిజినెస్ సొల్యూషన్స్ వంటి అన్ని రంగాలకు దీనిని విస్తరించారు.
ఎంపికైన స్టార్టప్లు ఆరు నెలల పాటు ఎన్బీఏ టీమ్స్తో కలిసి పనిచేసి, ఆపై లాస్ వెగాస్ సమ్మర్ లీగ్లో తమ ఐడియాలను ప్రపంచానికి చూపిస్తాయి. బెస్ట్ ఐడియాస్ ఉన్న కంపెనీల్లో ఎన్బీఏ నేరుగా కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పెడుతుంది. స్పోర్ట్స్ టెక్నాలజీ స్టార్టప్లకు మార్కెట్లో ఇన్వెస్టర్లు దొరకడం కష్టంగా మారిన తరుణంలో ఎన్బీఏ ఈ విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది.
డబ్బు కంటే కూడా ఆటపై ఉన్న పిచ్చితో సరికొత్త ఐడియాలు తెచ్చే వ్యూహకర్తల కోసమే తాము వెతుకుతున్నట్లు డేవిడ్ లీ వివరించారు. ఇప్పటికే డబ్ల్యూఎస్సి స్పోర్ట్స్, ఫాస్ట్బ్రేక్ డాట్ ఏఐ వంటి సంస్థల ద్వారా మ్యాచ్ హైలైట్స్, షెడ్యూల్స్ తయారీలో ఏఐ సేవలను వాడుతున్నారు. మ్యాచ్ చూసే ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినట్లుగా స్క్రీన్ను మార్చుకునే పర్సనలైజ్డ్ అనుభూతిని ఇవ్వడమే టెక్నాలజీ అసలు ఉద్దేశమని ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ఇంటర్వ్యూలను క్షణాల్లో స్థానిక భాషల్లోకి మార్చే రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నారు. అయితే, ఇంత పెద్ద గ్లోబల్ ప్రోగ్రామ్లో భారతదేశం నుంచి ఇప్పటివరకు ఒక్క స్టార్టప్ కూడా సెలెక్ట్ కాకపోవడం గమనార్హం. ఇండియా తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, త్వరలోనే భారతీయ స్టార్టప్ కంపెనీలు కూడా ఈ రేసులోకి రావాలని డేవిడ్ లీ గట్టిగా ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఆటగాళ్లకు గాయాలు కాకుండా ముందే అప్రమత్తం చేసే మెడికల్ టెక్నాలజీపై మరిన్ని ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. స్టేడియానికి రాలేని 99 శాతం మంది అభిమానులకు, ఇంట్లోనే కూర్చుని లైవ్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ తీసుకురావడమే ఈ టెక్నాలజీ ముందున్న అసలైన ఛాలెంజ్.

