కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ(Telangana) ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’(Young India Integrated Residential Schools) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో పనుల పురోగతి చూస్తుంటే ఆ ఆశలు క్రమంగా నీరుగారుతున్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.200 నుంచి రూ.300 కోట్ల వ్యయంతో ఈ పాఠశాలలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. కానీ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పనుల వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తుంగతుర్తి నియోజకవర్గంలోని తొండ గ్రామంలో శంకుస్థాపన జరిగి 14 నెలలు గడిచినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. జిల్లా కేంద్రం నల్లగొండలో 22 ఎకరాల విస్తీర్ణంలో పనులు మొదలైనప్పటికీ, ఎనిమిది నెలలుగా పునాది దశలోనే నిలిచిపోయాయి. మునుగోడు, సాగర్, దేవరకొండ ప్రాంతాల్లో ఇంకా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి ప్రముఖ నాయకులు ఉన్నప్పటికీ, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తోంది.
2025-26 విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలు సిద్ధమవుతాయని ఆశించిన తల్లిదండ్రులు, ప్రస్తుత పరిస్థితులను చూసి నిరాశ చెందుతున్నారు. 18 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ వేగాన్ని బట్టి చూస్తే 2027-28 నాటికైనా పూర్తవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక అధికారులను నియమించి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపనలకే పరిమితమైపోయే ప్రమాదం ఉంది.

