కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ముత్తంగి పరిధిలోని ఎంక చెరువును 7 కోట్ల 60 లక్షల రూపాయలతో సుందరీకరణ చేస్తున్నామని.. త్వరలోనే పనులను పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) తెలిపారు. సోమవారం ఆయన పనులను పరిశీలించి మాట్లాడారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలోని ఎంక చెరువును పర్యటకంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో హెచ్ఎండీఏ ద్వారా 7 కోట్ల 60 లక్షతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నిధులతో ఎంక చెరువు కట్ట అభివృద్ధి చేయడంతోపాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, వాకింగ్ ట్రాక్, గార్డెనింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని.. మరో రెండు నెలల్లో పనులు చేస్తామన్నారు. ఇస్నాపూర్ ప్రజలు సైతం చెరువుకట్టపైకి సులభంగా చేరుకునేందుకు కనెక్టింగ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే (MLA Mahipal Reddy) తెలిపారు. ఆయన వెంట హెచ్ఎండీఏ డీఈ రామారావు, మాజీ సర్పంచ్ ఉపేందర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కుమార్ గౌడ్, ప్రభాకర్, కిట్టు, శ్రీనివాస్ రెడ్డి, మేరాజ్ ఖాన్, రామకృష్ణ పాల్గొన్నారు.

