కలం, వెబ్డెస్క్: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మరోసారి తన బ్యాట్తో మెరిసిపోయాడు. అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం బాదిన జైస్వాల్, భారత్ను 9 వికెట్ల భారీ విజయానికి నడిపించడమే కాకుండా సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 86 బంతుల్లో 110 పరుగులతో నాటౌట్గా నిలిచిన జైస్వాల్కు సీనియర్ స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) అండగా నిలిచాడు. రోహిత్ 79 పరుగులు చేయగా, ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 170 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ కోల్పోయి 128 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
మ్యాచ్ అనంతరం జైస్వాల్ (Yashasvi Jaiswal) తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. వైట్బాల్ క్రికెట్లో పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, బౌలర్లను ఎలా ఆడాలనే విషయాల్లో రోహిత్ శర్మ ఇచ్చే సూచనలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని చెప్పాడు. సిరీస్ మొత్తం రోహిత్తో జరిగిన చర్చలు తన ఆటను మరింత మెరుగుపరిచాయని తెలిపాడు. అలాగే కోచ్ గౌతమ్ గంభీర్, సహాయక సిబ్బంది నుంచి కూడా స్పష్టమైన మార్గదర్శకత్వం లభిస్తోందని జైస్వాల్ పేర్కొన్నాడు.
డ్రెస్సింగ్ రూమ్లోని సానుకూల వాతావరణం, సహచర ఆటగాళ్ల విజయాలు తనను మరింత కష్టపడేలా ప్రేరేపిస్తున్నాయని చెప్పాడు. ఇక భారత్ విజయంలో ప్రసిద్ధ్ కృష్ణ కూడా మెరిశాడు. కెరీర్లో తొలి ఐదు వికెట్ల ఘనత సాధించి అఫ్గానిస్తాన్ను 218 పరుగులకు కట్టడి చేశాడు. జైస్వాల్ సెంచరీతో భారత్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలో తొలి వన్డే సిరీస్ విజయాన్ని కూడా అందుకుంది.
Read Also: అడవి దారి లేక.. ఆగమవుతున్న నల్లమల గిత్త!
Follow Us On : WhatsApp

