కలం, నల్లగొండ బ్యూరో: మదర్ డెయిరీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా ఎమ్మెల్యేలు, డెయిరీ చైర్మన్, డైరెక్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మదర్ డెయిరీలో నెలకొన్న వివిధ సమస్యలపై మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని డెయిరీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.
ఇటీవల మదర్ డెయిరీ (Mother Dairy) ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న సంగతి తెలిసిందే. డెయిరీలో తీవ్ర ఒడిదుడుకులు డైరెక్టర్ల మధ్య అంతర్గత కలహాలు.. మదర్ డెయిరీ ఎండీ అక్రమాలు.. చైర్మన్ రాజీనామా వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మదర్ డెయిరీ సమస్యలపై ఎమ్మెల్యేలు, యాజమాన్యం చర్చలు జరిపారు. అనంతరం మదర్ డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను, సంస్థ ప్రస్తుత స్థితిగతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి మదర్ డెయిరీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

