కలం, ఖమ్మం బ్యూరో: మైనర్పై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ బాలిక నేతాజీ కాలేజీలో ఇంటర్ చదివేది. అదే మండలం రంగాపురానికి చెందిన ఆటో డ్రైవర్ మలోత్ దుర్గాప్రసాద్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవడానికి 2022 జూన్ 4న బాలిక కాలేజీకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుర్గా ప్రసాద్.. బాలికను ఆటోలో తీసుకొని వెళ్ళాడు.
ఈ విషయం బాలిక స్నేహితుల ద్వారా తండ్రికి తెలిసింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి పాల్వంచ డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేయగా.. దుర్గా ప్రసాద్ పథకం ప్రకారం బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తేలింది. దర్యాప్తు ఆధారంగా పాల్వంచ డీఎస్పీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలు పరిశీలించి, వాదోపవాదాలు విన్న కోర్టు.. దుర్గా ప్రసాద్ నేరం చేసినట్లు రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు (Bhadradri Kothagudem) ఫోక్సో స్పెషల్ సెషన్ జడ్జి ఎస్.సరిత మంగళవారం తీర్పు వెలువరించారు.

