కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఒక భయంకరమైన హత్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. గత 20 ఏళ్లుగా కలిసి ఉంటున్న ఒక జంట మధ్య తలెత్తిన వివాదం చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. 70 ఏళ్ల వృద్ధుడిని అతనితో సహజీవనం చేస్తున్న 60 ఏళ్ల మహిళ కర్రతో కొట్టి మెడ బిగించి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరామారం గ్రామానికి చెందిన ఆవుల మల్లయ్య (70), లక్ష్మమ్మ (60) అనే మహిళతో గత రెండు దశాబ్దాలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పలు కారణాలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. విభేదాలు ముదరడంతో శాంతినగర్లో కలిసి ఉన్న వీరు విడిపోయారు. మల్లయ్య శ్రీరాంనగర్ కాలనీలో ఒక గదిని కిరాయికి తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఘటన జరిగిన రోజు మల్లయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. ఆ మత్తులో మళ్లీ పాత గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం తారాస్థాయికి చేరింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మమ్మ, గదిలో ఉన్న కర్రతో మల్లయ్యపై విచక్షణారహితంగా దాడి చేసింది. మల్లయ్య కింద పడిపోయాక ఆమె అతని మెడ బిగించి కొట్టడంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి రక్తపు మడుగులో పడి ఉన్న మల్లయ్యను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన లక్ష్మమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.

