కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో శనివారం మరో దారుణ ఘటన జరిగింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై ప్రియుడు కత్తితో (Attack on Women) దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. భర్తను కోల్పోయిన నూకరత్నం(25) అనే మహిళ నగరంలోని మియాపూర్ రెడ్డికాలనీలో హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నూకరత్నం(Nookaratnam) పని చేసే చోటే ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నూకరత్నంను ఆయన పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. భర్త చనిపోయిన నూకరత్నం.. తన జీవితాన్ని సరిదిద్దుకొని భావించి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 20న ప్రసాద్ అనే వ్యక్తిని నూకరత్నం వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నూకరత్నం తనకు కాదని, వేరే వాడిని పెళ్లి చేసుకుందని ఆవేశంతో ఊగిపోయిన ఆలీషా(Alisha).. ఎలాగైనా ఆమెను స్వంతం చేసుకోవాలని అనుకున్నాడు.
ఈ విషయాన్ని తన తండ్రి లాలూకు చెప్పగా.. కొడుకు సంతోషమే తన సంతోషమని భావించిన ఆ తండ్రి, కొడుకు చెప్పిన పథకానికి ఒకే చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ నూకరత్నం ఇంటికి వెళ్లి తనతో రావాలని బెదిరించారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. నూకరత్నం తనకు దక్కదని భావించిన అలీషా.. దారుణానికి ఒడిగట్టాడు. తనకు దక్కనిది వేరేవాడికి దక్కకూడదు అనే పిచ్చి పైశాచిక ఆవేశంతో నూకారత్నంపై దాడికి దిగాడు. గొడవ తీవ్రతరమవడంతో నూకరత్నంపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి ఇద్దరూ పారిపోయారు. రక్తపు మరకలతో పడి ఉన్న సదరు మహిళ నూకరత్నాన్ని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నూకరత్నం తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు అలీషా, అతని తండ్రి లాలూను అరెస్ట్ చేశారు.

