కలం, హెల్త్: రాత్రి సమయంలో నిద్రపోయే ముందు కానీ, లేదా నిద్ర రావడం లేదని కానీ చాలా మంది ఫోన్ (Avoid Screens) చూస్తుంటారు. స్క్రోల్ చేస్తూ.. నిద్ర వస్తుందని ఆశాభావంతో ఉంటారు. కానీ ఈ చిన్న అలవాటే మీ ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల శరీరంలో కలిగే శారీరక మార్పుల గురించి అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కునాల్ సూద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్క్రీన్ల నుండి వచ్చే కాంతి మన మెదడును, నిద్ర చక్రాన్ని ఎలా గందరగోళానికి గురిచేస్తుందో ఆయన వివరించారు.
డాక్టర్ సూద్ తెలిపిన వివరాల ప్రకారం, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల శరీరంలోని ‘సింపథెటిక్ నెర్వస్ సిస్టమ్’ (Sympathetic Nervous System) చురుగ్గా మారుతుంది. దీనివల్ల మనం ఫోన్ పక్కన పెట్టిన చాలా సేపటి వరకు కూడా శరీరం అప్రమత్తంగానే ఉంటుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో, శరీరం పొరపాటున ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ (పోరాడటం లేదా పారిపోవడం) అనే ఒత్తిడి స్థితిలోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ స్క్రీన్ల నుండి (Avoid Screens) వెలువడే ‘బ్లూ లైట్’ (నీలి కాంతి) మెదడును మోసం చేస్తుందని డాక్టర్ వివరించారు. అది పగటి వెలుతురు అని మెదడు భావించడం వల్ల, నిద్రను కలిగించే ‘మెలటోనిన్’ హార్మోన్ విడుదల ఆగిపోతుంది. ఫలితంగా కళ్లు మూసినా మెదడు మేల్కొనే ఉంటుంది, దీనివల్ల నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతుంది.
సోషల్ మీడియాలో వచ్చే వేగవంతమైన కంటెంట్, నోటిఫికేషన్లు మెదడులో ‘డోపమైన్’ను విడుదల చేస్తాయి. ఇది మెదడును మరింత ఉత్సాహపరిచి, విశ్రాంతి స్థితిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. సింపథెటిక్ వ్యవస్థ యాక్టివేట్ అవ్వడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతాయి. దీనివల్ల శరీరం ప్రశాంతతను కోల్పోతుంది. ఫోన్ వాడకం వల్ల సహజమైన కాంతి-చీకటి సంకేతాలను శరీరం గుర్తించలేకపోతుంది. ఇది దీర్ఘకాలంలో మన జీవ గడియారాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు.
మనం చేసే ‘డూమ్ స్క్రోలింగ్’ (అనవసరంగా ఫోన్ చూడటం) వల్ల శారీరక శ్రమ తగ్గిపోవడమే కాకుండా, శరీరం తనను తాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కోల్పోతుందని చెప్తున్నారు నిపుణులు. నిద్ర లేమి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవాలంటే, పడుకునే ముందు డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

