కలం, వెబ్డెస్క్: ఏపీలో పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఒక చట్టం, టీడీపీకి ఒక చట్టం ఉందా? అని అంబటి ప్రశ్నించారు. పోలీసులు విచారణ పేరుతో అడిగేవన్నీ పిచ్చి ప్రశ్నలేనన్నారు. స్టేషన్లలో పోలీసులు గంటల తరబడి కూర్చోబెడతారని చెప్పారు. వైసీపీ నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై విచారణలో భాగంగా నేడు అంబటి వేంపల్లి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నేతల భార్యలపై ఓ ఛానెల్లో అసభ్యంగా మాట్లాడితే 175 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అంబటి చెప్పారు. ఇక తమ పార్టీ అధినేతను టీడీపీ నేతలు రోజూ దూషిస్తున్నారని చెప్పారు. ఒక్కరి మీద కూడా కేసు నమోదు చేయడం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు నేరాలు చేసినా కేసులు పెట్టరని, వైసీపీ వాళ్లు ఏం చేయకపోయినా కేసులు పెడతారని అన్నారు. ఇది న్యాయమేనా అని ఏపీ డీజీపీని ప్రశ్నించారు. ఇక మంత్రి లోకేశ్, చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలని అంబటి హెచ్చరించారు. లోకేష్ రెడ్ బుక్కు, ఆయన పెట్టే కేసులకు తన కుక్క కూడా భయపడదని అంబటి వ్యాఖ్యానించారు. చంద్రబాబును విమర్శించినందుకు తనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు పెట్టారన్నారు. తన ఇంటిపై దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అన్ని ప్రభుత్వాల్లో పని చేయాల్సి ఉంటుందని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.

